09-06-2025 01:33:20 AM
జిల్లా కేంద్రంలో పాటు వివిధ నగరాలలో ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. గల్లీకో ఆస్పత్రి ఏర్పాటవుతోంది. ఇరుకిరుకు భవనాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే చర్యలు చేపట్టే అవకాశమే కనిపించడం లేదు. మొత్తంగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
రోగుల నుంచి ఫీజుల రూపంలో వేలకు వేలు పిండుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్నిసార్లు ఆస్పత్రులకు నోటీసులు పంపుతున్నప్పటికీ స్పందన లేదని తెలుస్తోంది. నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముడుపులు చెల్లించి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
నల్లగొండ టౌన్, జూన్ 8 : నల్లగొండ జిల్లా కేంద్రం తో పాటు వివిధ నగరాలలో కొంతకాలంగా ప్రైవేటు ఆస్పత్రులు విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. రోడ్లుకిరువైపులానే కాకుండా, గల్లీల్లో సైతం కొలువుదీరుతున్నాయి. కొత్త ఆస్పత్రుల్లో ఎక్కువభాగం ఇరుకైన ప్రదేశాల్లో, చిన్న చిన్న భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రుల నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పకుండా ఉండాలి.
సంబంధిత మునిసిపల్ అధికారుల ఆమోదం కూడా ఉండాలి. కానీ వీటిలో వేటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి ఎన్వోసీలు పొందకుండానే దర్జాగా నడుపుతున్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి కూడా క్లియరెన్స్ ఉండాలి.
పోలీసు శాఖ నుంచి కూడా అనుమతి పొంది ఉండాలి. కానీ ఇవేవీ ఉండడం లేదు. ఏదైనా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఫైరింజన్ వచ్చే అవకాశం లేదు. ఇతర రక్షణ చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు.
పేరుకే స్పెషలిస్టులు..
కొత్తగా ఏర్పాటవుతున్న ఆస్పత్రుల్లో ఆయా జబ్బులకు చికిత్స అందించడానికి నిపుణులైన ఫలానా డాక్టర్లు ఉన్నారంటూ బోర్డులు తగిలిస్తున్నారు. అది పేరుకే. అందులో ఎవరూ ఉండరు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనప్పుడు మాత్రం స్పెషలిస్టులను రపిస్తున్నారు. వారితో చికిత్స చేయిస్తున్నారు. స్పెషలిస్టులు అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు విషయంలో మరో విచిత్రమేమిటంటే.. వైద్య వృత్తిలో లేనివారు సైతం పెట్టుబడులు పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. తమకు అనుకూలమైన ఎంబీబీఎస్ డాక్టర్ల పేర్లు చూపి వారిపేరు మీద ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని రిజిస్టర్ కూడా చేయడం లేదు.
రోడ్లపైన జీవ వ్యర్థాలు..
ఆస్పత్రుల్లోని బయోవ్యర్ధాలను పారవేసే విషయంలో కూడా వాటి నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రోగుల చికిత్సలో వాడిన సిరంజీలు, ఇంజక్షన్ బుడ్లు, బ్యాండేజీలను బయట నిర్లక్ష్యంగా పారేస్తున్నారు. విజయటాకీస్ రోడ్డులోని ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు బయో వ్యర్థాలను ప్లాస్టిక్ బ్యాగ్లో నింపి బయట పెడితే వీటిని పారిశుధ్య సిబ్బంది సాధారణ చెత్తతో కలిపి ట్రాక్టర్లలో తీసుకువెళ్లి డంపింగ్ యార్డుల్లో వదిలేస్తున్నారు.
సాధారణంగా ఆస్పత్రి వ్యర్థాలను పారవేయడానికి బయోవేస్టేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. వీటిని సేకరించేందుకు ప్రత్యేకంగా ఉన్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. అవి ప్రత్యేక వాహనాల్లో బయోవ్యర్థాలను సేకరించి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద దహనం చేస్తాయి. ఇందుకు ఆస్పత్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తాయి. ఈ ఫీజును తప్పించుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రులు జీవ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేస్తున్నాయి.
ఆస్పత్రుల లెక్క ఇదీ..
నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, కొండమల్లేపల్లి, చండూరు తదితర పట్టణాల్లో ప్రధానంగా ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, నెప్రాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, కంటి తదితర విభాగాలకు చెందిన ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 586 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
అందులో అనేక ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల సాకు చూపి ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించకుండా లక్షల రూపాయలను రోగుల బంధువుల నుంచి వసూలు చేస్తున్నారు. చికిత్స అందించిన తరువాత ఆరోగ్యశ్రీ కింద తిరిగి బిల్లులు పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనేక ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నారు. చిన్న జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్లినా డెంగీ, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మూత్ర, రక్త, మలేరియ టైఫాయిడ్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయించి పరీక్షల పేరుతో వేలకు వేల రూపాయలు దండుకుంటున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కచ్చితంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు అమలు చేయాలి. యాక్టుకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ ఆస్పత్రులపై తనిఖీలు నిర్వహించి ఫీజుల దోపిడీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ పుట్ట శ్రీనివాస్, డీఎంహెచ్