calender_icon.png 5 July, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ ఎక్కడ?

05-07-2025 01:22:19 AM

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

  1. ప్రభుత్వాన్ని నిలదీసిన నిరుద్యోగులు 
  2. సచివాలయ ముట్టడికి యత్నం
  3. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి డిమాండ్ 
  4. అడ్డుకుని, అరెస్టు చేసిన పోలీసులు 

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలేవని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యేటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్, జాబ్ క్యాలెండర్ అమలును మరిచినట్టు కనిపిస్తోంది. ఎస్సీ రిజర్వేషన్లను సాకుగా చూపుతూ కాలం వెల్లదీస్తోందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. పైగా గత ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు అందజేసి తామే ఇచ్చినట్టు డప్పులు కొట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

గతేడాది అసెం బ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఈ ఏడాది జూ లై కావొస్తున్నా క్యాలెండర్ అమలును అటకెక్కించిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇప్ప టికే వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలతో నిరుద్యోగ యువత శుక్రవారం సెక్ర టేరియేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది హడావుడిగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిన ప్రభుత్వం, ఇంత వరకు దాన్ని పకడ్బందీగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

సర్కార్‌పై ఆగ్రహంతో..

జాబ్ క్యాలెండర్ అమలు, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ విషయంలో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలు, రిజర్వేషన్లు, కులగణన పేర్లు చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్లను కావాలనే వాయిదా వేస్తున్నారని ఆరో పిస్తున్నారు. కాలయాపనలో భాగంగానే జాబ్ క్యాలెండర్‌ను అటకెక్కిస్తున్నారని వా పోతున్నారు.

ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని మండి పడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేసి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో తూతూమంత్రంగా ప్రకటిం చినట్టు కాకుండా పకడ్బందీగా దాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.  

ఆర్థిక భారంతో సతమతం..

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదరుచూస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్, చిక్కడ పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లోని కో చింగ్ సెంటర్లలో వివిధ పోటీ పరీక్షలకు కో చింగ్ తీసుకుంటూ మరోవైపు హాస్టళ్లలో వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఆశగా ఎ దురుచూస్తున్న తమకు నిరాశే మిగులుతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. 

నామమాత్రంగా నియామకపత్రాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం తాము భర్తీ చేశామని చెప్పుకుంటున్న 60 వేల ఉద్యోగాల్లోనూ మె జార్టీ ఉద్యోగాలన్నీ బీఆర్‌ఎస్ హయాంలో వేసిన నోటిఫికేషన్‌లే. వీరొచ్చాక కొన్నింటికి పరీక్షలు నిర్వహిస్తే, మరికొన్నింటికి బీఆర్‌ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకు సం బంధించి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటుందని నిరుద్యోగు లు, బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

నోటిఫికేషన్లు విడుదల చేయాలి..

డీఎస్సీ, గ్రూప్స్, పోలీస్ తదితర నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయాలని అభ్య ర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వయసు దాటిపోతున్నా.. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి ఎదురు చేస్తున్నారు. ఏ ప్రభుత్వమొచ్చినా ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడటమే తమవంతవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఉద్యోగం రాకపోదా అని వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో చెప్పుకొని చదువుకునేందుకు డబ్బులు తెప్పించుకుంటున్నారు. చేసేది లేక వారు సైతం అప్పుసప్పు చేసి వారికి డబ్బులు పంపుతున్న పరిస్థితి ఉంది.