05-07-2025 01:28:49 AM
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ను శుక్రవారం బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. సాధార ణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ను పలువురు పార్టీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు.
రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలతోపాటు వర్తమాన రాజకీయ అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకు న్నారు. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ అందరితో ఉత్సాహంగా మాట్లాడారు.
కాగా శనివారం యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మండలి డిప్యూటీచైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, శంకర్నాయక్, చిరుమర్తి లింగయ్య, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, సతీశ్రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.