25-06-2025 12:29:43 AM
చదవాలని ఉన్నా సీటు దక్కలేదు.. ఆహన్న హస్తం కోసం ఎదురుచూపులు
నాగల్ గిద్ద, జూన్ 24 : రెండేళ్ళ వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన గిరిజన బాలిక అనాథగ మారింది. దీంతో చిన్ననాటి నుండి తాతమ్మలే పోషణ చూశారు. ఇటీవలే ఆరో తరగతి ప్రవేశం కోసం గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు పరీక్ష రాసింది. కానీ తనకు సీటు రాకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న తాతమ్మలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. తమ పాపను ఎవరైనా చదివించేందుకు ముందుకు రావాలని వారు దాతలను వేడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే...నాగల్ గిద్ద మండలం కిషన్ నాయక్ తండ గ్రామ పంచాయతీలోని రాథోడ్ సింధు 2015లో జన్మించింది. అదే సంవత్సరంలో తండ్రి గణపతి పని నిమిత్తం మధ్యప్రదేశ్ కి వెళ్లడం జరిగింది. పని దొరకకపోవడంతో తిరుగు ప్రయాణంలో ట్రైన్ లోనే మరణించడం జరిగింది. అనంతరం 2016లో తల్లి రాథోడ్ సునీత కూడా జహీరాబాద్ కు చెరుకు కొట్టడానికి వలసకు వెళ్ళి ఆకస్మిక మృతి చెందింది.
2 సంవత్సరాల పసిపాప అయినా సింధు తాత రాథోడ్ బిక్కు నాయక్ నానమ్మ చావలి భాయ్ మనవరాలి పోషణ చూసుకుంటూ ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నారాయణఖేడ్ ప్రాథమిక పాఠశాల మంగల్ పేటలో చదివించారు. ఉన్నతమైన చదువులు చదవాలని ఆశ ఉండడంతో గిరిజన గురుకుల పాఠశాల ఆరవ తరగతి ప్రవేశానికి పరీక్ష రాసినా ఉత్తీర్ణత కాకపోవడంతో తాత, నానమ్మ దగ్గరే సింధు తాండలోనే ఉంటుంది. చదువుపై మక్కువ ఉన్నా అవకాశం లేకపోవడంతో ఆదుకోవాలని వృద్ధులు కోరుతున్నారు.