12-06-2025 06:33:17 PM
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అవకాశం ఉంటే డిసిసి ఇవ్వండి, లేదంటే పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి(Congress Party President Gummula Mohan Reddy) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ నల్లగొండ జడ్పిటిసిగా ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశానని తెలిపారు. నాకు అధిష్టానం కేటాయించిన రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి న్యాయం చేయలేనని, నేనుండేది నల్లగొండలో రాష్ట్రస్థాయిలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని ఆ పదవి వారికి కేటాయించాలని సూచించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. నా అభిప్రాయంను మా నాయకత్వానికి తెలియజేశానని తెలిపారు. కావాలని కొంతమంది రాజకీయంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు .మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అభివృద్ధిలో పూర్తిస్థాయిలో ముందడుగు వేస్తుందన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు మంత్రి అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీ పనులు 600 కోట్లతో పూర్తిస్థాయిలో పనులు జరుగుతున్నాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన బాధితులకు త్వరలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. నల్లగొండ పట్టణం చెరవేగంగా అభివృద్ధి జరుగుతుందని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.అభివృద్ధిలో ముందస్తు ఆలోచనలతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ , మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, తదితరులు నాయకులు పాల్గొన్నారు.