20 March, 2026 | 5:41 AM

ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా?

20-03-2026 12:41 AM
  1. పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు
  2. ఆందోళన చెందుతున్న ప్రయాణికులు

మంగపేట, మార్చి 19 (విజయక్రాంతి) :  బూర్గంపహాడ్ - ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ములుగు జిల్లా మంగపేట మండలంలోని గంపోనిగూడెం జీ.సి.సి పెట్రోల్ బంకు సమీపంలో  ఉన్న కల్వర్టు వద్ద ఉన్న గొయ్యి ప్రమాదకరంగా ఉంది. ఈ కల్వర్టుకు అటూ ఇటూ పెద్ద గోతులు ఏర్పడి లోయలను తలపిస్తున్నాయి. రాత్రి వేళల్లో అయితే ఏమాత్రం కనిపించని పరిస్థితి. అయినా ఆర్.అండ్.బీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడాన్ని పలువురు ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ ప్రధాన రహదారి వెంట నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్చకపోవడంతో రహదారిపై ప్రయాణించే వాహనాలు, వాహన చోదకులు కల్వర్టులో పడిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే ఆర్.అండ్.బీ అధికారులు మేల్కొంటారా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్.అండ్.బీ అధికారులు స్పందించి కల్వర్టు వద్ద ప్రమాదకరంగా ఉన్న గోతులను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు, వాహన చోదకులు కోరుతున్నారు.

రోడ్లపై గోతులు పూడ్చాలి

కల్వర్టుకు రెండు వైపులా పెద్ద గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. కల్వర్టు వద్ద ఉన్న గొయ్యి దగ్గరికి వస్తే కాని కనిపించని పరిస్థితి. దీంతో కల్వర్టు వద్ద ప్రమాదభరితంగా మారింది. గోతులు పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన ఆర్.అండ్.బీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టు వద్ద ప్రమాదకరంగా ఉన్న గోతులను పూడ్చాలి.

తాటి నాగరాజు, మన్యసీమ పరిరక్షణ సమితి, మండల అధ్యక్షడు