18-06-2025 10:42:00 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రముఖ మత గురువు, హైదరాబాద్ కు చెందిన షహజాదే గౌసే ఆజం హజరత్ అల్లమా పీర్ సయ్యద్ షా కాజీమ్ పాషా ఖాద్రి అల్ మూసావి అల్ జిలానీ రహమతుల్లా అలై 5వ ఉర్సే వేడుకలు హైదరాబాద్ లోని హుసేని ఆలంలో ఈ నెల 21వ తేదీన ఉంటుందని బజ్మే అంజుమనే ఖాద్రీయ కాజ్మీయ జిల్లా అధ్యక్షుడు జహంగీర్ పాషా ఖాద్రి(District President Jahangir Pasha Quadri) తెలిపారు. జిల్లా కేంద్రం షాసాబ్ గుట్టలోగల హజరత్ మర్దాన్ అలీషా దర్గా ఆవరణలో బుధవారం ఉర్సు పోస్టర్లను దర్గా పీఠాధిపతి సయ్యద్ రజాక్ షా ఖాద్రీ, కొత్త కోటకు చెందిన మౌలానా అబిద్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జహంగీర్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ... పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అలే ముస్తాఫా ఖాద్రి అల్ మారూఫ్ అలీ పాషా ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. 21వ తేదిన సాయంత్రం 5 గంటలకు మూసా ఖాద్రి నివాసం నుంచి దర్గా షరీఫ్ వరకు ఊరేగింపు ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు వైభవంగా గందోత్సవం వేడుకలు ఉంటాయని తెలిపారు. అనంతరం దర్గాలో చాదర్లు, పూలు సమర్పించి ప్రత్యేక ఫాతిహ నిర్వహిస్తారని తెలిపారు.
రాత్రి 9 గంటలకు జల్సాయే పైజానే కాజ్మీయా ధార్మిక సదస్సు ఉంటుందన్నారు. నాతియా మహేఫిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన శిష్యులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో మర్కజి మిలాద్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్రోజ్ షా ఖాద్రి, వాసిఫ్ షా ఖాద్రి, మీర్ షోయబ్ అలీ, అడ్వకేట్ ఖాజా మైనద్దీన్ ఖాద్రీ, ఇలియాస్ ముజాహిద్ ఖాద్రీ, నజీర్ అలీ కాజ్మి, మొహసిన్ కాజ్మీ, షేక్ ఖాజా, జీషాన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.