calender_icon.png 3 May, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివిధ దేశాల సుందరీమణుల వరంగల్ సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలి

02-05-2025 09:43:45 PM

ఈ నెల 14న చారిత్రక వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ ను సందర్శించనున్న సుందరీమణులు..

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద

హనుమకొండ,(విజయక్రాంతి): ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 14వ తేదీన వరంగల్ పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈ నెల 14వ తేదీన వరంగల్ సందర్శన నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఇతర అధికారులతో  సందర్శన ఏర్పాట్లు, భద్రత, పర్యటన ప్రాంతాల వద్ద ఏర్పాట్లు, తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ షోబోట్  ప్రతినిధులు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందర్శించే ప్రదేశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ద్వారా వివరించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా లు మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా  హైదరాబాద్ నుండి హనుమకొండ హరిత కాకతీయ హోటల్ కి చేరుకుంటారని, అక్కడ వారికి స్వాగతం, బతుకమ్మ ఆట పాట కార్యక్రమం ఉంటుందన్నారు.  వారి రాక సందర్భంగా పోలీస్ భద్రత పటిష్టంగా ఉండాలని అన్నారు. హరిత కాకతీయ నుండి వేయి స్థంబాల దేవాలయానికి చేరుకుని దైవ దర్శనం చేసుకుంటారని, ఆలయం వద్ద బ్యారికేడ్ల ఏర్పాటు చేయాలని,  ఆలయ విశిష్టతను తెలియజేసేందుకు గైడ్  అందుబాటులో ఉండాలన్నారు.

అక్కడ ఫోటో షూట్, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షో బోట్ ప్రతినిధి , పోలీస్, పర్యాటక, ఇతర అధికారులతో చర్చించారు.  చారిత్రక వేయి స్థంభాల దేవాలయం సందర్శన అనంతరం ఫోర్ట్ వరంగల్ ను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఆ తదుపరి హరిత కాకతీయ కు చేరుకుని డిన్నర్ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరుతారని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఈస్ట్ జోన్ డీసీపి అంకిత్ కుమార్, ఏఎస్పీ మనన్ భట్, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, పర్యాటకశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.