calender_icon.png 17 February, 2026 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా

17-02-2026 09:45:00 AM

ఇల్లెందు, ఫిబ్రవరి 16,(విజయక్రాంతి): ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం 12:30 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా మునిసిపాలిటీలోని 24 వార్డు సభ్యులకు ముగ్గురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 24 మంది సభ్యుల్లో 19 మంది కాంగ్రెస్ గెలవగా, ముగ్గురు బీఆర్ఎస్, ఇద్దరు ఇండిపెండెంట్ లు గెలుపొందారు. ఇండిపెండెంట్ లు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో పాటు కాంగ్రెస్ నిర్వహించిన శిబిరంలోకి వెళ్లారు. సోమవారం ఉదయం కొత్తగూడెం ఆర్డీవో మధు మున్సిపాలిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమయానికి ముగ్గురు బీఆర్ ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు.

సమావేశం తర్వాత గంట సమయం ఇచ్చి మళ్లీ ఇతర సభ్యులకు ఎదురు చూడగా ఎవరు సమావేశానికి రాలేదు. దీనితో ఆర్డీవో మధు మంగళవారానికి మునిసిపల్ సమావేశం వాయిదా వేశారు. కాంగ్రెస్ ఇండిపెండెంట్ సభ్యులు మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు మునిసిపాలిటీకి చేరుకున్నారు. అప్పటికే సమావేశాన్ని ముగించి రేపటికి వాయిదా వేయడంతో కాంగ్రెస్ సభ్యులు వెను తిరిగారు. మరోవైపు ఇల్లందు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక సందిగ్ధంలో ఉంది. ఇల్లందు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ డేనియల్ భార్య దొడ్డ కిరణ్ మిత్ర చైర్పర్సన్ ఎంపికైనట్లు సమాచారం. చైర్ పర్సన్ ఎన్నికలో వార్డు సభ్యుల్లోనే అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది.

ఎనిమిదో వార్డ్ నుంచి గెలుపొందిన రేఖ స్వరూప చైర్పర్సన్ కు పోటీ పడటం విశేషం. కాంగ్రెస్ వార్డు సభ్యులు ఎక్కువమంది కిరణ్ మిత్రుకు మద్దతు తెలిపేందుకు కొంత ఉత్సాహం సూపటం లేదని సమాచారం. ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి వచ్చిన కౌన్సిలర్లను మరో శిబిరానికి తరలించి చైర్పర్సన్ ఎన్నికకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా టిఆర్ఎస్ నుంచి గెలుపొందిన ముగ్గురు వార్డు సభ్యులు సమయానికి హాజరు కావడంతో వారితో ప్రమాణస్వీకారం చేయించారు.