22-06-2025 05:49:31 PM
న్యాయం కోసం బాధితుల ఆందోళన..
ఒకేసారి మూడు ఇంజక్షన్లు.. అస్వస్థతకి గురై అక్కడికక్కడే మృతి
నెన్నల మండలంలో ఘటన..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): అచ్చిరాని ఆర్ఎంపీ వైద్యం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన శనివారం రాత్రి నెన్నల మండలం(Nennal Mandal) గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెన్నల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాసు(38) ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందాడు. కొంతకాలంగా శ్రీనివాసు ఫైల్స్ తో బాధపడుతున్నాడు. ఇదే క్రమంలో ఫైల్స్ తో ఇబ్బంది పడుతున్న శ్రీనివాసు దహేగాం గ్రామానికి వైద్యం కోసం శనివారం రాత్రి తన భార్య, తల్లిని వెంట తీసుకొని ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ సర్కార్ వద్దకి వెళ్ళాడు.
ఆర్.ఎం.పి వైద్యుడు ఒకేసారి మూడు ఇంజక్షన్లు ఇచ్చాడు. దీంతో చెమటలు పట్టి స్పృహ తప్పాడు. అస్వస్థత గురైన శ్రీనివాసును తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఆర్ఎంపి వైద్యుడు బినయ్ సర్కార్ శ్రీనివాసును బెల్లంపల్లికి తన కారులోనే ఆసుపత్రికి తీసుకొస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన వైద్యుడు మార్గమధ్యలోనే అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులు 108కు ఫోన్ చేసి అంబులెన్స్ ను తెప్పించుకున్నారు. అంబులెన్స్ లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి 11 గంటలకు శ్రీనివాసును తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
న్యాయం కోసం బాధితుల రాస్తారోకో..
వైద్యం వికటించిన మృతి చెందిన శ్రీనివాసు కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఆందోళనకు దిగారు. తన భర్త మరణానికి కారణమైన వైద్యుడు బినయ్ సర్కార్ పై చర్య తీసుకోవాలని శ్రీనివాస్ భార్య కళ్యాణి, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకి దిగారు. పోస్టుమార్టం చేయకుండా పోలీసులు జాప్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి తరపున పోలీసులు జరిపిన బేరసారాలు ఫలించలేదు. అటు పోస్టుమార్టం జరగకుండా ఇటు వైద్యుడి పై చర్యలు లేకపోవడంతో విసిగిపోయిన బాధితులు ధర్నాకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ కూడా పోస్టుమార్టం జరగలేదు. ఈ జాప్యంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ ఆందోళనతో రోడ్డుపై ఎక్కడికక్కడా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పరిస్థితి అదుపులో ఉంచేందుకు బెల్లంపల్లి, తాండూరు, మందమర్రి ప్రాంతాల నుంచి పోలీసులు రంగంలోకి దిగారు.
శ్రీనివాస్ మృతికి నష్టపరిహారంతో పాటు వైద్యుడు పై కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. బాధితుల తరఫున ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా వచ్చి ఆందోళనకు మద్దతుగా నిలిచారు. శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ఆందోళనను ఎo తకీ ఆందోళనకారులు విరమించక పోవడంతో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ రంగంలోకి దిగాడు. ఘటనాస్థలికి వచ్చి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తానని ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు. శ్రీనివాస్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.