06-10-2025 04:30:18 PM
పాపన్నపేట (విజయక్రాంతి): ఘర్షణలో దాడికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధి నాగ్సాన్ పల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన శేరి మహబూబ్(35) టైర్ పంక్చర్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని సోదరి సుల్తానా ఏడుపాయల వద్ద చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు. సుల్తానా దుకాణం పక్కనే నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన చాకలి విఠల్ సైతం చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా విఠల్ కు సుల్తానా కు గిరాకీ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో సుల్తానా, మహబూబ్ భార్య రేష్మా దుకాణంలో ఉండగా విఠల్, రాజమణి, యాదగిరి, మహేష్ లు దుకాణం వద్దకు వచ్చి సుల్తానతో గొడవ పడ్డారు.
దీంతో రేష్మా మహబూబ్ కి ఫోన్ చేసి విషయం తెలిపింది. విషయం తెలుసుకున్న మహబూబ్ అక్కడికి చేరుకోగానే విఠల్ తన భార్య రాజమణి, కొడుకులు యాదగిరి, మహేష్ లు మహబూబ్ పై చేతులతో దాడి చేశారు. కింద పడేసి ఛాతిపై గుద్దుతూ తన్నారు. అడ్డుకోబోయిన వారిని సైతం కొట్టారు. గాయాలైన మహబూబ్ ను చికిత్స కోసం మెదక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. తన భర్త మృతికి కారణమైన నలుగురిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య రేష్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.