11-07-2025 12:00:00 AM
జహీరాబాద్, జూలై 10: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య గురువారం రూ.65 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ మెదక్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ నిమ్జ్ భూ సేకరణ చేపట్టగా హుసెల్లి గ్రామంలోని ఓ రైతు 3.21 ఎకరాల భూమిని కోల్పోయారు.
ప్రభుత్వం నుంచి పరిహారంగా రూ.52 లక్షల చెక్కును ఇచ్చేందుకు నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి గతంలో రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ సతీష్ అధికారిక సహాయానికి బహుమతిగా రూ.15 వేలు డిమాండ్ చేశాడు.
ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉన్న ఫిర్యాదుదారుడి సోదరుడి పనిని పూర్తి చేస్తామని నిమ్జ్ డ్రైవర్ దుర్గయ్య మరో రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.. గురువారం రూ.65 వేలు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.