27-10-2025 04:41:42 PM
చింతకుంట్ల వెంకన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్..
తుంగతుర్తి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా పాలనతోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల పరిధిలోని రావులపల్లి, ఎక్స్ రోడ్డు తండా, గొట్టిపర్తి, గానుగ బండ, తూర్పు గూడెం, తుంగతుర్తి, అన్నారం, గుడి తండా గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ దయానందంతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పదేండ్ల కాలంలో రైతులకు బిఆర్ఎస్ చేయని మేలు, పది నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. కర్షకుల కష్టసుఖాలు తెలిసిన రైతు ప్రభుత్వం మాదనీ, అందుకే వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హమీని నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.
దేశచరిత్రలో కనీవిని ఎరుగని విధంగా అన్నదాతలకు ఏక కాలంలో రూ. రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి రైతన్నల కళ్ళల్లో ఆనందం నింపిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాల్ కు ఏ గ్రేడ్ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నరకాలకు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుందని అన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్, సిసీలు రామయ్య, రమేష్, సీఎఫ్ నర్సింగ్ నాయక్, మండల సమాఖ్య అధ్యక్షురాలు జమున, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ సింగ్, సొసైటీ డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, గొట్టిపర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు చిలకల వెంకన్న, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోతు వెంకన్న, రవీందర్, ఆయా గ్రామాల ఐకెపి నిర్వాహకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.