అడవిలో కార్చిచ్చు... విలవిలలాడుతున్న పక్షులు
ఉట్నూర్, మార్చి 12 (విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న కార్చిచ్చు తో అడవి దహించుకుపోతుంది. గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో వేసవిలో నేలరాలిన ఆకులకు మంటలు అంటుకుని చెట్లు కాలి పోతున్నాయి. ఓ పక్క వేసవి ఎండలు... మరోపక్క అడవిలో కార్చిచ్చు మంటలు చెలరేగడంతో అడవిలోని పక్షులు... అడవి జంతువులు అల్లాడిపోతున్నాయి.
ఉట్నూర్ ఏజెన్సీలోని వివిధ అడవి ప్రాం తంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలం సమాకా పంచాయతీ పరిధిలోని పాటగూడ రహదారి పక్కన గల అడవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టడంతో అడవిలో చెట్లపై కిలకిలలాడే పక్షులు కార్చిచ్చు మంటలకు అల్లాడిపోయాయి. పక్షులు రక్షణ కోసం అటు ఇటు తిరుగుతున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వేసవిలో కార్చిచ్చు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకొలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.




