26-06-2024 12:13:58 AM
ముంబై, జూన్ 25: గత గురువారం రికార్డు కనిష్ఠస్థాయికి పతనమయిన రూపాయి క్రమేపీ కోలుకుంటున్నది. మంగళవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 4 పైసలు పెరిగి 83.43 వద్ద ముగిసింది. గతవారం ఒక్కసారిగా 24 పైసలు పడిపోయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.68 వద్ద కనిష్ఠస్థాయిని తాకి, అదే రోజున 83.61 వద్ద నిలిచిన రూపాయి వరుసగా రెండు రోజుల్లో 14 పైసల వరకూ రికవరీ అయ్యింది.
ఈక్విటీ మార్కెట్లు బలంగా ట్రేడ్కావడం, భారత్ కరెంటు ఖాతా మిగులులోకి వచ్చిందన్న రిజర్వ్బ్యాంక్ ప్రకటన రూపాయి రికవరీకి దోహదపడ్డాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. సానుకూల దేశీయ మార్కెట్లు, డాలరు బలహీనతతో రూపాయి పాజిటివ్గా ట్రేడ్ అవుతుందని అంచనా వేస్తున్నట్టు బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. అయితే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రూపాయిని బలహీనపరుస్తాయ న్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 105.5 సమీపంలో, బ్రెంట్ క్రూడ్ ధర 85.60 వద్ద ట్రేడవుతున్నాయి.