03-05-2025 01:48:51 AM
అమరావతి, మే 2 : అమరావతి ఒక నగరం మాత్రమే కాదని, ఒక స్వప్నం సాకారం కాబోతోందనే భావన కలుగుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షిం చారు. ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ శుక్ర వారం హాజరై శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశానని, ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కావని, ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులని స్పష్టం చేశారు.
వీరభద్ర స్వామి, అమరలింగేశ్వరస్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, పవన్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదే శ్కు ఇది శుభ సంకేతమని చెప్పారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎద గాలని ఆకాంక్షించారు.
అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని, రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు. అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టారు. దుర్గా భవానీ కొలువైన ఈ పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు. తన ప్రసంగం మధ్య మధ్య లో తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.
ఏం చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం..
‘టెక్నాలజీ నాతో మొదలైనట్టు చంద్రబాబు ప్రశంసించారు.. తాను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీని ఎ లా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా.. అధికారుల్ని పంపించి హైదరాబాద్ ఐటీ అభివృ ద్ధిని అధ్యయనం చేయించా.. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా త్వరగా పూర్తి చేయా లన్నా చంద్రబాబుకే సాధ్యం.. పెద్దపెద్ద పనుల్ని చేపట్టి పూర్తిచేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేరు.
2015 లో ప్రజారాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా.. గతపదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది.. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుంది.. అమరావతిలోఅన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అం దింస్తుంది. ఎన్టీఆర్.. వికసిత ఏపీ కోసం కలలుగన్నారని, మనందరం కలిసి ఆయన కలల్ని నిజం చేయాలి. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలి.
పవన్ కళ్యాణ్ ఇది మనం చేయాలి..మనమే చేయాలి.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది.. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ. వేల కోట్లు సాయం చేస్తుంది.’ అని ప్ర ధాని మోదీ చెప్పారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి శుభసంకేతం..
ఇంద్రలోకం రాజధాని అమరావతి, ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే అని ప్రధాని మోదీ చెప్పారు. స్వర్ణాం ధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమని తెలిపారు. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతి అని కొనియాడారు. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారు తుందన్నారు. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మారుతుందన్నారు. అమరావతిలో మౌలికవస తుల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఏపీకి గతం కంటే పది రెట్ల బడ్జెట్..
ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందన్నారు. ఈ అనుసంధానం తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్లలోపే ఉండేదని, ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులిచ్చామని తెలిపారు. ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.
గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు, అండర్పాస్లు నిర్మించామని తెలిపారు. వందేభారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. ఏపీలో 70కిపైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందడంతోపాటు ఈ ప్రాజెక్టుల వల్ల వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
రైతు వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. రైతులకు పథకాలు, పరిహారం కింద రూ. 17 వేల కోట్లు సాయం చేశామని వెల్లడించారు. పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తామని, ప్రతీ ఎకరానికీ నీరు ఇచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని, నాగాయలంకలో టెస్టింగ్ రేంజ్, దుర్గామాతలాగా భారత రక్షణ రంగానికి శక్తినిస్తుందన్నారు. శ్రీహరి కోట నుంచి ప్రయోగించే ప్రతీ రాకెట్ కోట్లాది భారతీయులకు గర్వకారణమన్నారు. భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదని, మన ఐక్యత కూడా అని స్పష్టం చేశారు. దీంతోపాటు విశాఖలో యూనిటీమాల్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
యోగా డేకు హాజరవుతా..
విశాఖలో జూన్ 21న జరుగనున్న యోగా డేలో పాల్గొంటానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తనను ఆహ్వానించినందుకు రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. వచ్చే 50రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదని, ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువ కాదన్నారు.
ఏపీ సరైన మార్గంలోనడుస్తోందని, సరైన వేగంతో ముందుకెళ్తోందని చెప్పారు. దీన్ని కొనసాగించాలని, మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు అన్నారని, ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో తాను ఊహించగలనన్నారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రగతిని మార్చబోతోందన్నారు.
వెంటిలేటర్పై నుంచి బయటకు వచ్చాం..
2024 ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లేసి గెలిపించారని, మోదీపై నమ్మకం, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే 93 శాతం హిట్ రేట్ వచ్చిందని చంద్రబాబు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరంగాఉందన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం, వ్యక్తిగ తంగా ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతు న్నామని చెప్పారు.
రైతుల పోరాటం వల్లే అమరావతి పునఃప్రారంభం..
రైతుల పోరాటం వల్లే అమరావతి పునఃప్రారంభమైందని సీఎం చంద్రబాబు కొని యాడారు. ఇది అందరి విజయమన్నారు. ‘లాఠీదెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు.. ఎన్నో బాధలు.. అవమానాలు..అయినా వెనకడుగు వేయలేదు.. హ్యాట్సాఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో చూడలేదు. మళ్లీ చూస్తానని కూడా నమ్మకం లేదు. రైతు ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా.. ఐదు కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా నిర్మిస్తాం.’ అని చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు.
వంద పాకిస్థాన్లు వచ్చినా : లోకేశ్
ఒక్క పాకిస్థాన్ కాదు.. వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేవని మంత్రి నారా లోకేశ్ అన్నారు. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మతిరగడం ఖాయమన్నారు. భారత గడ్డపై మొక్క కూడ పీకలే రని హెచ్చరించారు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానమని, ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కనబెట్టారని, అమరావతికి అండగా ఆంధ్రా ప్రజలంతా నిలబడ్డారని పేర్కొన్నారు.
ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్: సీఎం చంద్రబాబు
ఏపీ కలల రాజధాని అమరావతి నగరం మాత్రమే కాదని, ఐదుకోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 29వేల మంది రైతులు ఏకంగా 34 వేల ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు..ప్రపంచానికే ఇదో చరిత్ర అని చెప్పారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే..గత ఐదేళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు.
గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని, ఇటీవల కలిసినప్పుడు చాలా గంభీరంగా కనిపించారని గుర్తుచేశారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో మోదీ ఉన్నారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతిచర్యకూ అండగా ఉంటామన్నారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని, మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు భారత ఆర్థికవ్యవస్థ పదో స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఐదో స్థానానికి ఎదిగిం దన్నారు. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. కులగణన చేయాలని మోదీ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు.
దివిసీమ తుఫాన్లా అమరావతిని తుడిచేశారు: పవన్కల్యాణ్
అమరావతి రైతులు ఐదేళ్లుగా నలిగిపోయి, లాఠీదెబ్బలు తిన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. గతంలో రైతులను కలిసినప్పుడు ‘మా కన్నీళ్లు తుడిచేదెవరు’ అని అడిగినట్టు గుర్తుచేసుకున్నారు. దేశమే తమ కుటుంబంగా ప్రధాని మోదీ భావిస్తున్నారని కొనియాడారు. దివిసీమ తుఫానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసిందన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులే విజయం సాధించారని తెలిపా రు. రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
అమరావతి రైతుల త్యాగాలను మరిచిపోలేమన్నారు. రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామన్నారు. రైతులు భూములు ఇవ్వడం మాత్రమే కాదు, రాష్ట్రానికి భవిష్యత్నిచ్చారని పేర్కొన్నారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ట రాజధానిగా ఆవిర్భవిస్తుందని ఆకాంక్షించారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుతా ్వలు ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. భవిష్యత్లో మన విద్యార్థులు బెంగుళూరు, హైదరాబాద్ వలస వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.
అందరం కోరుకున్నట్టు చంద్రబాబు సీఎం అయ్యారని, ఆయన పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతి రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. అమరావతికి సహకరిస్తున్న మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవానీమాత మోదీని మరింత శక్తిమంతుల్ని చేయాలని ఆకాంక్షించారు.
58వేల కోట్ల ప్రాజెక్టులు ఇవి..
రూ.58వేల కోట్ల విలువైన మొత్తం 94 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వాటిలో రాజధాని నగర సంస్థలు, జాతీయ రహదారులు, రైల్వే అప్గ్రేడ్, రక్షణ సంబంధిత అంశాలు ఉన్నాయి. 49వేల కోట్లతో 74 ప్రాజెక్టులకు పునాది వేశారు.
వీటిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు, న్యాయ నివాస గృహాల నిర్మా ణం, 5,200 కుటుంబాలకు గృహాల నిర్మా ణం, అలాగే భూగర్భ, అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలు, వరద ఉపశమన ప్రాజెక్టులు, అమరావతి అంతటా సెంట్రల్ మీడియన్లు, సైకిల్ ట్రాక్లు, ఇంటిగ్రేటెడ్ యుటిలిటీలతో కూడిన 1,281 రోడ్లు, నాగాయలంకలో డీఆర్డీవో క్షిపణి పరీక్షా కేంద్రానికి రూ.1459 కోట్లు, వైజాగ్ యూనిటీమాల్కు 100 కోట్లు, గుంతకల్ మల్లప్ప గేట్ రైల్ ఓవర్ బ్రిడ్జికి రూ.293కోట్లు, ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులకు రూ.3,176కోట్లు వంటి..5,028కోట్ల విలువైన తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.