సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తి టీచర్: జడ్జి రాధిక
నిర్మల్ (విజయక్రాంతి): అన్ని ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ ఉద్యోగం ఎంతో గౌరవం ఉందని దాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి రాధిక(Senior Judge Radhika) అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతులను జిల్లా విద్యాధికారి రామారావు(District Education Officer Rama Rao)తో కలిసి, పరిశీలించి, ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉపాధ్యాయ వృత్తి సమాజంలో చాలా గౌరవ ప్రదమైన వృత్తి అని, ఉపాధ్యాయులు సమాజంలో గౌరవించబడతారని, వారు సమాజ నిర్మాతలు అని తెలిపారు.
ఉపాధ్యాయులు సమాజ శ్రేయస్సు కోసం, విద్యార్థినుల భవిష్యత్తు కోసం పొక్సో చట్టం(POCSO Act) గురించి తెలుసుకోవాలని, ఉపాధ్యాయులకు పొక్సో చట్టం గురించి, చట్టంలోని పలు సెక్షన్స్ గురించి, శిక్షల గురించి వివరించారు. విద్యార్థులకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి వివరిస్తూ, విధ్యార్థినులను అప్రమత్తం చేయాలని, వాటి బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆమె వివరించారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినిలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అన్ని విషయాలు వివరించి, విధ్యార్థినులను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏఓ వెంకటరమణారెడ్డి, ఏఎంఓ నర్సయ్య, కోర్స్ ఇంచార్జి లు, డి ఆర్ పి లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






