04-06-2025 12:00:00 AM
కొత్తకోట జూన్ 3 : కొత్తకోట మండలం భూత్కూర్ గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు భూ భారతిపై అవగాహన, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కేట్ కమిటీ ఛైర్మన్ పల్లే పాగు ప్రశాంత్, మండల అధ్యక్షుడు బీచుపల్లి,జిల్లా ప్రధాన కార్యదర్శి పాపయ్య గారి కృష్ణారెడ్డి,మాజీ సర్పంచ్లు చర్లపల్లి శేఖర్ రెడ్డి, శివరాం, ఆంజనేయులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తహశీల్దార్ తో కూడిన బృందాలు గ్రామాలకు వెళ్లి ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. త్వరలో ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసి,త్వరగా భూసమస్యలను పరిష్కరించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా భూత్పూర్ గ్రామంలో వివిధ సమస్యలతో కూడిన 28 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్లు 2, డియస్ పెండింగ్ 8, తల్లితండ్రుల పేర్ల సవరణలు 1, అసైన్మెంట్ పట్ట కోసం 7, సక్సెషన్ వితౌట్ పిపిబి 7, ఖాతా మార్జింగ్ 1, సాదా బైనామా కోసం 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిని భూ భారతి చట్టంలో క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు న్యాయం జరిగే విదంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్బంగా మార్కేట్ కమిటీ ఛైర్మన్ పల్లే పాగు ప్రశాంత్ మాట్లాడుతూ తహసిల్దార్ల నేతృత్వంలోనే రెవెన్యూ బృందాలు ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్లి, దరఖాస్తులను స్వీకరిస్తారని,ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా భూ వివాదాలకు భూభారతి చట్టం తో శాశ్వత పరిష్కారం అందిస్తుందనీ అన్నారు.
గత ప్రభుత్వ బి ఆర్ ఎస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో రైతులు వారి ప్రమేయం లేకుండానే భూ సమస్యలు చిక్కుకున్నారని అన్నారు దీని ఫలితంగా భూ పరిపాలనలో విస్తృతమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా భూభారతి చట్టం ద్వారా గ్రామస్థాయిలో భూ సమస్యలు తక్కువ సమయంలోనే పరిష్కారం పొందే అవకాశం ఉందనీ,ఇది భవిష్యత్తులో వ్యవసాయ అభివృద్ధికి పునాదివేసే విధంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.