10-05-2025 12:07:30 AM
రూ. 2000రూపాయల జరిమాన
నేరం చేస్తే శిక్ష తప్పదు
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదీ విధించడంతోపాటు రెండు వేల జరిమానా న్యాయమూర్తి విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం తెలిపారు. నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. కామారెడ్డి సదాశివ నగర్ వీఆర్వో నీరడి ముత్తన్న ఇచ్చిన సమాచారం మేరకు, కామారెడ్డి నుండి నిజామాబాద్ వెళ్ళే NH-44 రోడ్డులో కల్వర్ట్ కింద గుర్తు తెలియని మగ శవం 2020 జూలై 13న శవము సదాశివ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శవం ముఖం నుండి ఛాతివరకు పూర్తిగా కుళ్లిపోయి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసుల ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. పోలీసుల విచారణలో
భాగంగా మృతుని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను, ఇతర గ్రామస్తులను విచారించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానం, సిసి ఫుటేజ్ ఉపయోగించి గోల్కొండ రవికుమార్ @ రవి @ రవీందర్ తండ్రి నరసయ్యను నేరస్తునిగా గుర్తించి అరెస్టు చేశారు. మృతుడు అయిన యాడల అలియాస్ మాడల సతీష్ తండ్రి గురువయ్యను తేదీ 10.07.2020 నాడు రవికుమార్ కు ఫోను చేసి ఇద్దరం కలుద్దామని చెప్పగా వారిద్దరూ సదాశివ నగర్ లో కలసి వైన్స్ దగ్గరికి వెళ్లి మద్యం కొనుగోలు చేసి సేవిస్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మృతుడు అతని భార్యను, భార్య బంధువులను, నేరస్తుని కూడా తరచుగా తిట్టడంతో అట్టి విషయం మనసులో పెట్టుకొని నేరస్తుడైన గోల్కొండ రవికుమార్ ఎలాగైనా మృతుడు సతీష్ ను చంపాలని మనసులో పెట్టుకొని ఆర్మూర్ వెళ్దామని నమ్మించి మర్కల్ ఎక్స్ రోడ్ వైపుకు వెళుతుండగా కల్వర్టు వద్దకు చేరుకోగానే మృతుడిని కల్వర్టు దగ్గర కూర్చోబెట్టి ఆపై వంతెన పై నుండి తోసి వేయగా మృతుడు వంతెన పైనుండి కింద పడిపోగా గాయాలు అయినవి.
వెంటనే నేరస్తుడు రవికుమార్ కిందకు దిగి రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. ఇట్టి విషయములో సాక్షులను విచారించి, సరియగు సాక్షాలను సేకరించి నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ వేశారు. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని గౌరవ జిల్లా న్యాయమూర్తి గౌ. CH.VRR వర ప్రసాద్ నిoదితునికి జీవిత ఖైదు, రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పి వెల్లడించారు. పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్, ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్, అప్పటి యస్ఐ నరేశ్ , సదాశివనగర్ ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, యస్ఐ రంజిత్. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై రాజయ్య, ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి, CDOs రాజేశ్, సాయిలు లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.