03-08-2025 12:37:07 AM
ఆకలితో అలమటిస్తున్న గిరిజన విద్యార్థులు
విద్యార్థులపై అలసటత్వం వహిస్తున్న పట్టించుకోని ఉన్నతాధికారులు
అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలo లో చీపురుగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు పెద్దపీట వేసి ఉన్నత విద్యను అందించే క్రమంలో విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏజెన్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం కొన సాగుతుందని , చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు గిరిజన ,పేద విద్యార్థులని అలాంటి విద్యార్థులను మోసం చేస్తూ హెచ్ఎం వార్డెన్ సొమ్ము చేసుకోవడం బాధాకరమన్నారు.
ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చదువుకునే దానికోసం ఆశ్రమ పాఠశాలకు వస్తే వాళ్లని అడ్డాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారని ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమన్నారు. పాఠశాలలో ఉండే విద్యార్థులకు వాళ్లు వేసుకునే హాజరు సంఖ్యకు ఏమాత్రం సంబంధం లేకుండా జిసిసి నుండి వస్తున్న అన్ని రకాల పప్పు ఉప్పు మంచి నూనె మొదలగు వాటిని అమ్ముకుంటూ గిరిజన విద్యార్థుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. హెచ్ఎం వార్డెన్ల లావాదేవీల మీద విద్యార్థులకు అందవలసిన గుడ్డు, అరటిపండు, స్నాక్స్ మొదలగు వాటిని కూడా పెట్టకుండా విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై ఐటిడిఏ పిఓ సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.