26-08-2025 07:06:59 PM
వనపర్తి,(విజయక్రాంతి): కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం ఘన్పూర్ మండలంలో పర్యటించి వివిధ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లర్లకు వానాకాలం (ఖరీఫ్) మరియు రబీ సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలు వాటి సరఫరాపై తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలలో భాగంగా లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ను సందర్శించి, అనంతరం శ్రీనివాస ఇండస్ట్రీస్ను పరిశీలించారు.
చివరగా, ఘన్పూర్ గ్రామంలోని శ్రీరామ ఇండస్ట్రీస్కు వెళ్లి ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను, సీఎంఆర్ డెలివరీల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ బియ్యంను పౌరసరఫరాల శాఖకు అప్పగించడంలో ఎటువంటి అలసత్వం వహించరాదని రైస్ మిల్లర్లను గట్టిగా హెచ్చరించారు. సీఎంఆర్ డెలివరీలలో ఏ మాత్రం జాప్యం జరిగినా ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తుందని, సంబంధిత రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతుల శ్రేయస్సు మరియు ప్రభుత్వ లక్ష్యాల సాధన దృష్ట్యా మిల్లర్లు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.