7 August, 2026 | 2:29 AM

రోడ్లన్నీ ఒకే నెట్‌వర్క్‌లోకి

07-08-2026 01:00 AM
  1. ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్, ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు ఒకే సిస్టమ్‌లోకి తీసుకురావాలి 
  2. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలు ఉండొద్దు 
  3. రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వేగవంతం చేయాలి
  4. హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డులు, నగరంలోని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర రోడ్లు అన్ని ఒకే నెట్‌వర్క్ సిస్టమ్‌లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతో అన్ని అంశాలు ఈ సిస్టంలోకి తీసుకురావాలన్నారు. గురువారం ఎంసీఆర్‌హెచ్ ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) లిమిటెడ్ అధి కారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్కడిక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఔటర్ రింగ్ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని సీఎం సూచించారు. టీడీఆర్‌పైన కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ చే యాలన్నారు.

టీడీఆర్ ప్రక్రియను మొత్తం ఆన్‌లైన్‌లో చేయాలని, టీడీఆర్‌లో ఎలాం టి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థను రూపొందించాల న్నా రు. రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్ 1ను డిసెంబర్ 9 లోగా పూర్తిచేయాలని, రేడియల్ రోడ్ల నిర్మాణంలో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. 

నాణ్యతలో రాజీలేదు..

రోడ్ల నిర్మాణంలో రాజీలేదని, హైదరాబాద్ భవిష్యత్ రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని, అధికారులు అలసత్వం వహించొద్దని సీఎం పేర్కొన్నారు.  బద్వేల్ ఇంటర్‌చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకమన్నారు. ఎలేవేటెడ్ కారిడార్ల 111 పనులు వేగవంతం చేయాలని, బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలు పెట్టాలని, భూ సేకరణ వేగవంతం చేయాలని సూచించారు.

రోడ్ల ప్లానింగ్, నిర్మాణంలో ట్రాఫిక్ విభాగాన్ని భాగస్వామ్యం చేయాలని, ల్యాండ్  పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దన్నారు. సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం కార్యదర్శి మణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.