16-12-2025 01:04:16 AM
తండ్రికి తీవ్ర గాయాలు
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఎల్బీనగర్, డిసెంబర్ 15(విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి చెందగా, ఆమె తండ్రికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ లో నివాసం ఉండే ఎంసాని పాండు కుమార్తె ఎంసాని ఐశ్వర్య(19) మహబూబ్ నగర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
సోమవారం ఉదయం.. పాండు కూతురుతో కలిసి ఆర్టీసీ కాలనీ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటి బస్టాండుకు వెళ్తుండగా అతి వేగంతో వచ్చిన కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో తండ్రీకూతుళ్ళిద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. స్పందించిన స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయ పడిన పాండును మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.