అంగన్వాడీ టీచర్ దారుణహత్య
ములుగు, మే 15 (విజయక్రాంతి): అంగన్ వాడీ టీచర్ దారుణహత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెంది న సుజాత (48) తాడ్వాయి మండ లం కాటాపూర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా ప్రతిరోజు తన గ్రామం నుంచి కాటాపూర్కు వెళ్లి వస్తుంటారు. రోజు మాదిరిగానే మంగళవారం విధులకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి రాలేదు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అడవికి వెళ్లిన తునికాకు కూలీలకు కాటాపూర్, తాడ్వాయి మధ్యలోని నాంపల్లి పెద్దగుట్ట వద్ద సుజాత మృతదేహం కనిపించింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజా త మెడకు స్కార్ఫ్ చుట్టి హత్య చేసినట్టు నిర్దారించారు. అంతేగాకుండా సుజాత మెడలోని నాలుగు తులాల బంగారం, సెల్ఫోన్ చోరీకి గురైనట్టు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు.




