15-10-2025 01:14:39 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : ఏపీలోని విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేలా గూగుల్తో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ఢిల్లీలోని తాజ్మాన్సింగ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీవైష్ణవ్, ఏపీ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వా పాల్గొన్నారు.
గూగుల్ సంస్థ ఆసియాలో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ విశాఖపట్నాన్ని ఏఐ సిటీని చేయడానికి సుమారు 15 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల 2028 మధ్య రాష్త్ర స్థూల ఉత్పత్తికి ప్రతి సంవత్సరం రూ.10,518 కోట్లు సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందని అదేవిధంగా గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల వల్ల ఏటా రూ.9,553 కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందని అంచనా వేస్తున్నారు.