07-10-2025 07:31:00 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): న్యాయమూర్తిపై దాడి న్యాయ వ్యవస్థని కించపరచడమేనని మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. అనంతరం న్యాయవాదులు కోర్టు గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ పౌరులు అందరూ న్యాయవ్యవస్థని గౌరవించాలని అన్నారు. వ్యవస్థని ఎవరు కించపరిచినా, కించపరిచేలా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజ శేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.