29-06-2025 02:29:20 AM
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తాను కూడా రాష్ట్ర బీజేపీ అధ్య క్ష పదవికి పోటీ పడుతున్నట్టు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను కూడా అధ్యక్షుడు పదవి అడుగుతానని.. ఇస్తారా లేదా అన్నది అధిష్ఠానం ఇష్టమని పేర్కొన్నారు.1995 నుంచి హిందూ వాహిని కార్యకర్తగా పనిచేశాన, 2009లో మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ రాకపోవడంతో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచినట్టు తెలిపారు.
2014 నుంచి గోషామహల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని చెప్పారు. హిందుత్వం, ధార్మిక విధానాల కోసం ఎన్నో సేవలు చేసినట్టు తెలిపారు. గో సంరక్షణ కోసం పోరాటం సాగిస్తున్నానన్నారు. ధార్మిక సేవ చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లినట్టు చెప్పారు.
ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 77 రోజులు జైలుకి వెళ్లినట్టు వివరించారు. తనకు అధ్యక్ష పదవి ఇవ్వరని కూడా తెలుసని, అయినా ప్రయత్నం చేస్తానని స్పష్టంచేశారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై విమర్శలు చేసిన రాజాసింగ్.. తర్వాత కాస్త నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నానని ప్రకటించడం విశేషం.