26-12-2025 01:38:12 AM
హైదరాబాద్ ధీర్ పార్క్లో ఏర్పాటు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): బీసీల ఐక్యతే బలంగా, అధికారమే లక్ష్యంగా అనే నినాదంతో ఈ నెల 28న హైదరాబాద్లోని ధీర్ పార్క్లో బీసీ జన భోజనాల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాదులోని బీసీ భవన్లో బీసీ జన భోజనాల మహోత్సవం బ్రోచర్ను గురువారం బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జన భోజనాల నిర్వహణ కమిటీ సభ్యులు చామకూర రాజు, కేవి గౌడ్, రఘురాం నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలు గత ఎనబై ఏండ్లుగా రాజకీయ అధికారాన్ని అందుకోలేక పోతున్నారని, విడివిడిగా ఉన్న బీసీ కులాల చైతన్యం, 136 కులాలుగా ఉన్న బీసీలు సంఘటితంగా ఆశించిన స్థాయిలో చైతన్యం రావడంలేదని అన్నారు. కులాలుగా తాము సంఘటితమవుతూనే, బీసీలుగా బలపడడానికి ఈ వన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మహోత్సవానికి రాష్ట్రంలోని బీసీలందరూ రాజకీయ పార్టీలకతీతంగా కుటుంబ సమేతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షుడు లచ్చ గౌడ్, వెంకటేష్, మల్లేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు.