భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ పీఠంపై ఆశ..
గాదె కేశవరెడ్డి దరఖాస్తు
అశ్వాపురం, అక్టోబర్ (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్ష పదవి రేసులో పినపాక నియోజకవర్గ సీనియర్ నాయకుడు గాదె కేశవరెడ్డి చేరారు. జిల్లా కాంగ్రెస్ పీఠాన్ని ఆశిస్తూ, అశ్వాపురం మండలానికి చెందిన కేశవరెడ్డి గురువారం ఏఐసీసీ కార్యదర్శి, జిల్లా అధ్యక్ష దరఖాస్తుల పరిశీలన బాధ్యతలు చూస్తున్న జాన్ అబ్రహంకు తన దరఖాస్తును సమర్పించారు. దరఖాస్తు సమర్పించిన అనంతరం గాదె కేశవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తాను విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీ జెండాను తన ఎజెండాగా మలుచుకొని నిస్వార్థంగా పనిచేశానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై తనకున్న అపార నమ్మకాన్ని వెల్లడిస్తూ, తాను కరుడుగట్టిన కాంగ్రెస్ వాది నని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. సుదీర్ఘకాలంగా పార్టీకి చేసిన సేవలు, నిస్వార్థ అంకితభావాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించాలని, భద్రాద్రి కొత్తగూడెం డిసిసి అధ్యక్ష పదవిని తనకు కేటాయించాలని ఆయన గట్టిగా కోరారు. కేశవరెడ్డి దరఖాస్తుతో జిల్లా కాంగ్రెస్ పీఠం రేసు మరింత రసవత్తరంగా మారింది. పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన నాయకులకు అవకాశం ఇవ్వాలన్న కేశవరెడ్డి విజ్ఞప్తిపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.




