11-10-2025 12:58:45 AM
బీసీ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి టౌన్ : కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావని, బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సమగ్ర కులగణన నిర్వహించి, బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరమా..? అని బిజెపి బిఆర్ఎస్ పార్టీలను ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుపై ఇప్పటిదాకా గవర్నర్ సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తే... విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు.
బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయని,ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెపం నెట్టడమే తప్ప బీసీలకు నిజమైన మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కింది నుంచి పై కోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన నిర్వహించి.. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానంటే.. బిజెపి, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కడుపు మండుతోందని, ఇకనైనా బిజెపి బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆపి బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు.