16 August, 2026 | 7:33 AM

రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన బీజేపీ

17-06-2024 03:26 PM

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారం పార్టీ సీనియర్ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాషాయ పార్టీ మహారాష్ట్రకు రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను నియమించింది.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్యానాలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తారు. శివరాజ్ సిగ్ చౌహాన్ జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. సెప్టెంబరులోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన జమ్మూకశ్మీర్‌లో బీజేపీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రంగంలోకి దింపింది. ఈ రాష్ట్రాలకు కో-ఇంఛార్జిని కూడా పార్టీ నియమించింది. మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, హర్యానాకు బిప్లబ్ కుమార్ దేబ్, జార్ఖండ్‌కు హిమంత బిస్వా శర్మ నియమితులయ్యారు. 

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ ప్రాబల్యాన్ని కోల్పోయింది. మహారాష్ట్రలో మొత్తం 17 స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ పోటీ చేసిన 28 స్థానాలకు గాను కేవలం 9 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. రాష్ట్రంలోని 48 సీట్లలో ఎంవీఏ 30 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే 17 మాత్రమే కైవసం చేసుకోగలిగింది.