25-07-2025 08:51:17 PM
చండూరు,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు, చండూరు మండల ఎన్నికల ప్రభారి పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి జెండా ఎగరవేయడానికి నాయకులు సిద్ధం కావాలని, అన్ని స్థానాలలో పోటీ చేసి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, ప్రజలు బిజెపి ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని, గ్రామాలలో కేంద్రం నుండి వస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. అర్హలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని, మహిళలకు వృద్ధులకు కాంగ్రెస్ చేసిన మోసాలను తెలియజేసి, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.