26-12-2025 05:34:36 PM
రికార్డు స్థాయిలో 504 మంది అయ్యప్ప భక్తుల రక్తదానం: జిల్లా ఎస్పి జానకి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అయ్యప్ప స్వామి భక్తులు రక్తదానం చేయడం ఒక గొప్ప సేవా భావానికి నిదర్శనమని జిల్లా ఎస్పి జానకి అన్నారు. అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో గురువారం మహబూబ్ నగర్ లోని అయ్యప్ప కొండపై నిర్వహించిన మెగా వైద్య శిబిరంను జిల్లా ఎస్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి భక్తులు అన్న దానం, రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమను చేస్తూ మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమన్నారు.
రక్తదానం చేసిన భక్తులను ఈ సందర్భంగా అభినందించారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులు సి.ఆర్.భగవంతు రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా గత 18 ఏళ్ళ నుంచి ప్రతి అయ్యప్ప కొండపై రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా రక్త దాన శిబిరం లో 504 మంది అయ్యప్ప భక్తులు రక్త దానం చేశారని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ తెలిపారు.
గత ఏడాది రికార్డు స్థాయిలో రక్తదానం చేసిన అయ్యప్ప సేవా సమాజం ప్రతినిధుల కు రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ గవర్నర్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి వెంకటేశ్వర్లు, అయ్యప్ప స్వామి సేవా సమాజం ప్రధాన కార్యదర్శి ముత్యం స్వామి, కోశాధికారి చంద్ర శేఖర్ యాదవ్, నిర్వాహకులు పంబ రాజు, నారాయణ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ శ్రీకర్ , రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.