01-12-2025 02:37:23 PM
తిరువంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Kerala CM residence) అధికారిక నివాసం, పాలయంలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో బాంబులు పెట్టినట్లు ఇమెయిల్ బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శికి బెదిరింపు ఇమెయిల్ అందిన తర్వాత, ఆయన నివాసం క్లిఫ్ హౌస్లో సోదాలు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
తనిఖీలు నిర్వహించిన డాగ్ స్క్వాడ్, బాంబు గుర్తింపు బృందం బెదిరింపులు బూటకమని తేల్చారు. ఈ ఈమెయిల్స్ పంపిన వ్యక్తి తమిళనాడులోని రాజకీయ పరిణామాలను, అక్కడ నమోదైన కేసులను ప్రస్తావించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. డార్క్ వెబ్ అప్లికేషన్లను ఉపయోగించి ఈమెయిల్స్ పంపారని, దీని వలన నిందితులను గుర్తించడం కష్టమైందని పోలీసులు తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా బెదిరింపు ఇమెయిల్లు వచ్చినప్పుడల్లా తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.