27-06-2025 01:06:39 AM
* గోల్కొండ జగదాంబికా, మహంకాళి అమ్మవార్లకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తొలి బోనాన్ని సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు గోల్కొండ కోటకు తరలివచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, బీజేపీ నాయకురాలు మాధవిలత అమ్మవారులను దర్శించుకున్నారు.
కార్వాన్, జూన్ 26: గోల్కొండ జగదాంబికా, మహంకాళి అమ్మవార్లకు గురువారం తొలి (నజర్) బోనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టు వస్త్రాలను అందజేశారు. లంగర్ హౌస్లో నిర్వహించి న కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనం ద్, ఎంపీ అనిల్ కుమార్యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, కలెక్టర్ హరిచందన, జోగిని నిషాక్రాంతి, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.
మంత్రి కొండా సురేఖ, జోగిని నిషాక్రాంతి బంగారు బోనా న్ని ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గోల్కొండ జగ దాంబికా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చంటిబాబు, ఈవో వసంత ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలం దరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని కోరారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారు ఎంతో మహిమగల తల్లి అన్నారు. జంట నగరాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు.
గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అనంతరం స్వీకర్ మం త్రులు ప్రజాప్రతినిధులు బంగారు బోనం ఎత్తుకొని పట్టు వస్త్రాలతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారి రథంలో ఉంచారు. గోల్కొండ కోటకు తీసుకెళ్లి జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమా ర్ యాదవ్ శివసతులతో కలిసి డాన్స్ చేసి అందర్నీ ఉత్సాహపరిచారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్లు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మెట్టు సాయికుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు కవిత, విజయశాంతి, హైదరాబాద్ బీజేపీ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి మాధవిలత గోల్కొండ కోటలోని జగదాంబిక, మహంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు.
బంగారు బోనం సమర్పణ
గోల్కొండలోని చోటా బజారులో ఉన్న పూజారి అనంత చారి ఇంట్లో నుంచి జగదాంబికా అమ్మవారి ఉత్సవమూర్తులను ఊ రేగింపుగా తీసుకెళ్లారు. రిసాల బజార్ ప్రాం తానికి చెందిన జగదాంబికా ఆలయ వృత్తి పనివారాల సంఘం సలహాదారు బొమ్మల సాయిబాబా చారి కుటుంబంలోని శ్రీకాంత్చారి, సురేష్చారి, శివచారి ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బంగారు బోనం, పుస్తెలతాడు బహుకరించారు.
రిసాల బజా ర్ నుంచి గోల్కొండ కోట వరకు మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులను భారీ ఐరావతం బొమ్మపై ఊరేగించారు. కేరళ నుంచి ప్రత్యేకంగా వాయిద్యకారులను పిలిపించా రు. కుమ్మరులు 450 మందితో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
సందడిగా గోల్కొండ కోట
తొలి బోనం సందర్భంగా జంట నగరాలతో పాటు రంగారెడ్డి జిల్లా, వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు గోల్కొండ కోటకు తరలివచ్చారు. శివసత్తుల పూనకాలు, పోత రాజుల విన్యాసాలతో లంగర్ హౌస్, గోల్కొండ కోట దద్దరిల్లింది. లంగర్ హౌస్ నుంచి సుమారు 32 ఫీట్ల భారీ తొట్టెలను గోల్కొండ కోటకు తరలించారు. వందలాది మంది కళాకారులు, పోతరాజులు అలరించారు.