12-06-2025 06:21:17 PM
హైదరాబాద్: అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు బయలుదేరిన AI171 విమానం గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 53 మంది బ్రిటన్ భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.
పరిస్థితిపై ఎప్పటికప్పుడు భారత్ తో సంప్రదించి వివరాలను తెలుసుకుంటున్నట్లు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి డేవిడ్ లామీ మాట్లాడుతూ... భారతదేశంలోని అహ్మదాబాద్లో జరిగిన విధ్వంసకర విమాన ప్రమాదం వార్త తీవ్ర విచారం కలిగించిందన్నారు. వాస్తవాలను తక్షణమే నిర్ధారించడానికి, తమ మద్దతు అందించడానికి యూకే భారతదేశంలోని స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషన్ కూడా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ భారతీయులు. విమానంలో ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒకరు కెనడియన్ ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. కూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.