12-06-2025 05:53:30 PM
హైదరాబాద్: అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు బయలుదేరిన AI171 విమానం గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘాని ప్రాంతం సమీపంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటన మాటలకు అందని మహావిచారమని, బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. బాధితుల సహాయార్థం అధికారులతో పాటు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రధాని మోదీ స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు. విమానంలో ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒకరు కెనడియన్ ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. కూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రయాణీకుల సంఖ్య ప్రాణనష్టంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెల్లడించలేదు.