02-12-2025 07:49:21 PM
హైదరాబాద్: బీమా సొమ్ము కోసం తమ్ముడు అన్నను చంపిన ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. టిప్పర్ తో ఢీకొట్టి చంపి ప్రమాదంగా చిత్రీకరించాడు. మూడురోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. రామడుగు మండల కేంద్రానికి చెందని మామిడి వెంకటేశ్(39) శనివారం రాత్రి మట్టి తరలిస్తుండగా బ్రేక్ డౌన్ అయింది. దీంతో వెంకటేష్ టిప్పర్ మందు భాగంలో మరమ్మతులు చేస్తున్నాడు. అది గమనించకుండా తమ్ముడు నరేష్ టిప్పర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ప్రమాదవశాత్తు వెంకటేష్ టిప్పర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
దీంతో నవంబర్ 29న మృతుని తండ్రి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి తమ్ముడిపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య కుట్ర ప్రణాళికను నిందితులు ఫోన్ లో వీడియో తీశారు. ఆ వీడియో దొరకడంతో హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. రెండు నెలల్లోనే మృతుడు వెంకటేష్ పేరు మీద 10 బీమా కంపెనీలలో 4.14 కోట్ల విలువైన బీమా పాలసీలను నరేష్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బీమా సోమ్ము కోసమే అన్నను హత్య చేశారని పేర్కొంటూ పోలీసులు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.