25-08-2025 04:58:50 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమక్షంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి(BJP State Council Member Vijaya Bharathi) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ... బడే భాయ్, చోటే భాయ్ కలిసి పనిచేస్తున్నారని.. పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకేరకంగా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పెద్ద మోదీ చెప్పారని.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చిన్న మోదీ చెప్పారని తెలిపారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తానని పెద్ద మోదీ అన్నారని, రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని చిన్న మోదీ అన్నారని కేటీఆర్ అన్నారు. అదానీని రాహుల్ గాంధీ విమర్శిస్తే.. రేవంత్ దానిని పొగుడుతున్నారని, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీని ఆటలో అరటిపండుగా మార్చారని పేర్కొన్నారు. మోదీ, రేవంత్ కలిసి రాహుల్ గాంధీకి పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని అన్నారు.