25-08-2025 07:54:08 PM
బిచ్కుంద మండలం సెట్లుర్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఘటన
అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆస్పత్రిలో చేరిక
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లుర్ ప్రాథమిక పాఠశాల(Shetloor Primary School)లో చదువుతున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వారిని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం కారణంగా జరిగిందా లేక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను అధికారులు తొలగించారు. సంఘటన స్థలాన్ని మండల విద్యాశాఖ అధికారి సందర్శించి విద్యార్థుల బాగోగులను తెలుసుకున్నారు.