07-08-2025 12:03:58 AM
నారాయణఖేడ్, ఆగస్టు 6: నారాయ ణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూరు మండలం రాయిపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో ఎద్దు సజీవంగా దహనమైన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడి ఉస్మాన్ సాబ్ తన పొలం దున్నుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న వైర్లు తగలడంతో రెండు ఎడ్లు ప్రమాదానికి గురికాగా ఒకటి పారిపోగా మరో ఎద్దు విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగి సజీవంగా దహనమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కండ్లముందే ఎద్దు సజీవంగా దహనం అవుతుండటంతో రైతు బాధ వర్ణనాతితంగా మారింది. స్థానిక రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించి విద్యుత్తు తొలగించి ట్రాన్స్ఫార్మర్ మంటలను అదుపు చేశారు. కాగా రూ. 80 వేల మేరా రైతు నష్టపోయాడని స్థానికులు పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుందని, గతంలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపించారు. ప్రమాదానికి గురైన ఎద్దు యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్చేశారు.