13-12-2024 01:53:18 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఆ రాష్ట్రంలోని నారాయణ్పుర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం తెల్లవారు 3 గంటల నుంచి సాగిన ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
యాంటీనక్సల్ ఆపరేషన్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, దంతేవాడ, జగదల్పూర్, కొండగావ్ జిల్లాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ క్రమంలో దండకారుణ్యంలో కూబింగ్ చేస్తుండగా భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.
నెలరోజుల వ్యవధిలోనే సుమారు 60 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. గత నెల 22న కోంటా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విధితమే. ఈనెల 8న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు గాయపడగా, ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలు మరువక ముందే గురువారం అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది.