01-05-2025 01:20:13 AM
వైద్య విద్యార్థులతో సహా ఆరుగురి మృతి
కోవూరు, ఏప్రిల్ 30: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. వీరిలో ఐదుగురు వైద్య విద్యార్థులు ఉండడం గమనార్హం. విషయంలోకి వెళితే.. పోతిరెడ్డిపాలెం వద్ద ముంబై జాతీయ రహదారిపై ఉప్ప పెట్రోల్ బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే మృతి చెందగా..
కారులో ఉన్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుచ్చిరెడ్డి పాలెంలో తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విద్యార్థులను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఐదుగు రు ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్థి నవనీత్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చనిపోయిన విద్యార్థుల్లో అభిషేక్ రాజ్ (అనంతపురం), జీవన్ చంద్రారెడ్డి (నెల్లూరు), యజ్ఞేశ్ (ప్రకాశం), నరేశ్ (అనంతపురం), పురుషోత్తం (తిరుపతి) ఉన్నారు. వీరంతా నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్నారు.