01-05-2025 12:30:11 AM
నకిలీ డాక్టర్లపై చర్యలు శూన్యం
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో వెలుగులోకి నిజాలు
చర్యలకు వెనుకాడుతున్న డీఎంహెచ్వో
పట్టించుకోని జిల్లా అధికారులు
సూర్యాపేట, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జిల్లా నకిలీ డాక్టర్ల రాజ్యం నడుస్తున్నది.. సగంకు పైగా డాకర్లు చదువుకు సంబందం లేని వైద్యం చేస్తున్నారు, నకిలీ సర్టిఫికెట్లతో వైద్య దందా నిర్వహిస్తున్నారని గత కొద్ది రోజులుగా ఆరోపణలు ఉండగా...జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోకున్నా... గత కొద్ది రోజులుగా మెడికల్ కౌన్సిల్ బృందం జిల్లాలో నకిలీ డాక్టర్ల వ్యావహారం తమ తనిఖీలతో వెలుగులోకి తీసుకొస్తున్నది. అయితే కౌన్సిల్ సభ్యులు ఆధారాలతో నకిలీ డాక్టర్లను పట్టించిన వారిపై సంబంధిత శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారం మొత్తం ఇప్పుటు జిల్లా వైద్యాధికారి చుట్టూ తిరుగతున్నది. ప్రస్తుతం జిల్లా విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది.
మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో వెలుగులోకి నిజాలు
జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ బృందం చేసిన తనిఖీల్లో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. అర్హత లేకున్నా నకిలీ సర్టిఫికెట్ తో 13 ఏళ్లుగా నిర్వ హిస్తున్న స్కానింగ్ సెంటర్ బాగోతం అధికారుల తనిఖీల్లో బయటపడింది. జిల్లా కేంద్రంలో ఆపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఇన్నాళ్లూ ఎండీ రేడియాలజిస్టుగా చలామణి అవుతూ వచ్చారు. తనిఖీల్లో కేవలం ఎంబీబీఎస్ మాత్రమే పూర్తి చేసినట్లు సర్టిఫికెట్స్ బయటపడ్డాయి. ఎంబీబీఎస్ ఎం.డీ. రేడియాల జిస్ట్ గా నకిలీ సర్టిఫికెట్ సృష్టించినట్లు అధికారులు దృవీకరించారు.
ఇదే స్కానింగ్ సెంటర్ లో పని చేస్తున్న మరో రేడియాలజిస్ట్ అలీ ఖాన్ ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎం.డీ.గా చెప్పు కుంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సదరు డాక్టర్ ఎంబీబీఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. శరత్ కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్ శిరీష పేరిట అనుమతి తీసుకుని అసలు డాక్టరే లేకుండా ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియనే వైద్యం అందిస్తున్నట్లు గుర్తిం చారు. శ్రీ కృష్ణ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రవి శేఖర్ అనస్తీషియా ఆర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్ గా అవతారం ఎత్తి ఏకంగా సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.
అంతేకాకుండా హాస్పిటల్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తుండగా అందులో పని చేస్తున్న రేడియాలజిస్ట్ సైతం ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఉండడం కొసమెరుపు. సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎం.డీ.గా చలామణి అవుతున్నారు. అయితే రెండేళ్ల క్రితం చైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా.. రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇలా అనేక నిజాలు కౌన్సిల్ తనిఖీలలో వెలుగులోకి వచ్చాయి.
జిల్లా వైద్యారోగ్యశాఖ ఏంచేస్తున్నది
జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి నకి లీ సర్టిఫికెట్లతో కొందరు డాక్టర్లుగా చలామని అవుతూ వస్తున్నారు. హాస్పటల్కు అనుమతులు ఇచ్చేముందు అన్ని దృవపత్రాలను సరి చూసుకున్నాకే అనుమతులు ఇస్తారు. కానీ జిల్లాలో ఏలా అనుమతులు వస్తున్నాయో ఎవ్వరికి అంతుపట్టడం లేదు. అదే కాకుండా జిల్లాలో మరి కొంత మంది ఫేక్ డాక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అ విషయం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు సహితం దృవీకరిస్తున్నారు. కొందరు అర్హత లేని వారు కూడా వేరే వ్యక్తి ఫార్మసీ సర్టిఫికెట్, డాక్టర్ల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుంటూ వారికి నెలనెలా జీతం చెల్లిస్తూ అసుపత్రులను నిర్వహిస్తున్నారు.
కానీ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ సభ్యులు ఆధారాలతో పట్టించిన నేటికి వారిపై ఏలాంటి చర్యలు లేవు. ఈ దందా వెనుకా ఆ శాఖ అధికారుల హస్తం సహితం ఉందని, లేకుంటే ఏలాంటి దృవపత్రాలు చూడకుండా అనుమతులు ఏలా ఇస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందిచి నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సహితం కోరుతున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వినతీపత్రం అందిచారు.