29-06-2025 06:40:20 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని కార్మెల్ ఉన్నత పాఠశాల(Carmel High School) 2000-01 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట చేరి ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 24 సంవత్సరాల విరామం తర్వాత బాల్య మిత్రులందరూ విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలో కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకొని సందడి చేశారు. గత స్మృతులను, పాఠశాలలో చేసిన అల్లరి పనులను స్మరించుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం బాల్య మిత్రులు అందరూ ఒకచోట కలవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల ఆవరణలో కలియ తిరిగి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పి తమ జీవితాలను మలుపు తిప్పిన గురువులను వేదికపైకి ఆహ్వానించిన విద్యార్థులు, పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫాదర్ థామస్, జిజో, శంకర్, కిరణ్, అమర్, సారయ్య, శంకర్, సుగుణ, డి అమూల్య, ఫాతిమాతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.