29-07-2025 03:29:19 PM
దర్శనం రమేష్ టీయుసీఐ జిల్లా కమిటీ సభ్యులు
తుంగతుర్తి,(విజయక్రాంతి): కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 31న జరిగే ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ సభ్యులు దర్శనం రమేష్ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని కామ్రేడ్ దుబ్బాక సంజీవరెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వలన కార్మిక వర్గం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నదని ఆయన ఆవేదన చెందారు. అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా దిన దిన గండంగా బ్రతుకును వెళ్ళదిస్తున్నారని ఆవేదన చెందారు. పని గంటల పెంపు జీవో 282లో వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. నాలుగు లేబర్ కోడ్లని విరమించుకోవాలని, రాష్ట్ర అసెంబ్లీలో లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. కార్మికులందరికీ 26 వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.