22-01-2026 05:40:07 PM
గ్రామీణ క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం
ముత్తారం ఎంపీడీఓ సురేష్
ముత్తారం,జనవరి 22 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి కప్ 2025 క్రీడలను పురస్కరించుకొని ముత్తారం మండలంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పోటీపడాలనుకునే క్రీడాకారులు వెంటనే అంతర్జాలం (ఆన్లైన్) ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మండల స్థాయి పోటీలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ క్రీడల్లో భాగంగా పరుగు పందెలు, వాలీబాల్, కబడ్డీ మరియు ఖో-ఖో వంటి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీలు ఈ పోటీలను పర్యవేక్షిస్తాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఎంపీడీఓ కోరారు.