19-10-2025 08:54:35 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీకి చెందిన సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ క్రీడాకారుడు, మడికొండ సీఐ పులియాల కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత, నిస్వార్థ సేవను గుర్తించి సభ్యులు సీఐ కిషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని హనుమకొండలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి అధ్యక్షతన ఈ ఎన్నిక జరిగింది.
ఈ సందర్భంగా సీఐ పులియాల కిషన్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, జిల్లాలోని అథ్లెటిక్ క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పులియాల కిషన్ ను తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, రాష్ట్ర సభ్యుడు పగిడిపాటి వెంకటేశ్వర్రెడ్డి, కోచ్లు శ్రీమన్, నాగరాజులు ఘనంగా సన్మానించారు. కాగా బెల్లంపల్లికి చెందిన కిషన్ పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే వరంగల్ జిల్లాలో నిర్వహించిన అనేక క్రీడా పోటీల్లో క్రీడాకారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.