02-06-2025 12:33:23 AM
మృతుడు కనకయ్య పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తాం
బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేత
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
గజ్వేల్,జూన్ 1: హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలం కాగా, గత ప్రభుత్వ పథకాలకు కోతలు పెడుతున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి మక్తా గ్రామానికి చెందిన మృతుడు కనకయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ్ రెడ్డి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు సంతోష వెంకటేష్ తో కలసి రూ 5 లక్షల చెక్కు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రజతోత్సవ సభ ఘనంగా జరిగినప్పటికీ దురదృష్టవశాత్తు కనకయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. కనకయ్య పిల్లలు ఆన్విక, శాన్విక లను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించడంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు భీమా సౌకర్యం కల్పించగా, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని అన్నారు. కార్యకర్తలు, ప్రజల్లో ఆత్మవిశ్వాసం, భరోసా కల్పిస్తూ ప్రతిక్షణం అండగా ఉంటున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి దొంగ కేసులు, దొంగ మాటలతో పబ్బం గడుపుకుంటుండగా, కెసిఆర్ కిట్టు, రైతుబంధు, పంట రుణమాఫీ వంటి పథకాలు అటకెక్కినట్లు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేయగా, జహీరాబాద్ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైటు తో చికిత్స చేయడం సిగ్గుచేటని నిలదీశారు. కాగా గత కెసిఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ఆసుపత్రుల్లో మందులు, సూదులు, డీజిల్ లేకపోవడం కాంగ్రెస్ పాలన తీరుకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు.
అయితే గజ్వేల్ లో రూ 30 కోట్ల వ్యయంతో వంద పడకల మాతా శిశు ఆసుపత్రి ప్రారంభించగా, వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు బాధపడుతూ మార్పు కోరుకుంటుండగా, ఐదేళ్లపాటు ఈ దరిద్రపు పాలన తప్పదని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పిటిసి బాలు యాదవ్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, నాయకులు రమేష్ గౌడ్, వేలూరి కృష్ణారెడ్డి, భీమ్ రెడ్డి, భాస్కర్ గౌడ్, లింగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.