ప్రొఫెసర్ జయశంకర్కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో, ఉద్యమానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని సీఎం కొనియాడారు. తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడు ఆచార్య జయశంకర్ అన్నారు. జయశంకర్ సారు ఆశయాలు, విలువలు, నిబద్ధత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాసేవ లక్ష్యాల సాధనకు ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలిపారు.






